విదుర నీతి
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
ఏకయా ద్వే వినిశ్చిత్య త్రీంశ్చతుర్భిర్వశేకురు।
పంచ జిత్వా విదిత్వా షట్సప్త హిత్వా సుఖీ భవ
ఒక్కదాంతో రెండిటిలో నిర్ణయించటం, మూడింటిని తెలుసుకొని, నాలుగిటిని వశపరుచుకోవాలి, తద్వారా ఐదింటిని జయించి, ఆరు విషయాలను తెలుసుకొని, ఏడు విషయాలను గనుక వదిలివేస్తే సుఖముగా ఉంటాము అని విదురులవారు పేర్కొంటున్నారు.
ఈ ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు ఏమిటో ఇప్పుడు చూద్దాము.
‘ఏకయా ద్వే వినిశ్చిత్య.’ ఏకయా అంటే ఒకటి. ద్వే అంటే రెండు. ఒక దాంతో రెండిటిని నిర్ణయించుకోవాలి అని విదురులవారు పేర్కొంటున్నారు. ఏమిటా రెండు – మంచి, చెడు. ఈ మంచి చెడుల మధ్య దేంతో నిర్ణయించుకోవాలి? ఏమిటా ఒకటి అంటే బుద్ది. భగవంతుడు మానవుడికి మాత్రమే బుద్దిని ఇచ్చాడు, సృష్టిలోని 84 లక్షల జీవరాశులకు ఆ బుద్దిని ఇవ్వలేదు. కాబట్టి ఆ బుద్దిని వాడుకొని, ‘త్రీం’ అంటే మూడింటిని (శత్రువులను, మిత్రులను, తటస్తులని) తెలుసుకోవాలి. మనము బుద్దితో మంచి చెడులను నిర్ణయించుకున్నతరువాత తెలుసుకోవాల్సిన ఆ మూడు ఏమిటి?
ఎవరు మనకు శత్రువులు, ఎవరు మనకు మిత్రులు, ఎవరు తటస్తులు, ఎవరు మన అభిప్రాయాలతో ఏకీభవిస్తారు, ఎవరు మన అభిప్రాయాలతో విభేదిస్తారు, ఎవరు మన అభిప్రాయాలతో తమకు ఏమి సంబంధం లేనట్లుగా, అటు ఇటు కాకుండా ఉంటారో తెలుసుకోవాలి. ఆలా తెలుసుకొని, వారితో వ్యవహారాన్ని నడిపేటప్పుడు నాలుగిటిని వాడాలి. ఏమిటా నాలుగు – సామ, దాన, భేద, దండోపాయాలు. ఈ నాలుగిట్లో నుంచి ఏదో ఒకటి వాడి వారితో మన పనులను సాధించుకోవాలి.
ఈ నాలుగు వాడుతూ ఐదింటిని (పంచ జిత్వా) జయించాలి. ఏమిటా ఐదు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియాలను జయించాలి. అలాగే ఒక ఆరు విషయాలు తెలుసుకొని ఉండాలి. ఏమిటా ఆరు అంటే – సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము,సంశయము). ఈ విషయాలను గురించి తెలుసుకొని ఉండాలి.
సప్త హిత్వా సుఖీ భవ – ఒక ఏడు విషయాలను గనుక వదిలివేస్తే మనము సుఖముగా ఉండగలుగుతాము. సప్తవ్యసనాలు అంటారు – స్త్రీ వ్యామోహము, జూదము,వేట, మద్యము (మధుపానము),కఠినవచనములను (పౌరుషముగా మాట్లాడటము), దండకాఠిన్యము (కఠినముగా ఉండటం), అన్యాయధనార్జనము (ధనాన్ని వృధా చెయ్యటం). ఈ ఏడు మనము వదిలివేస్తే సుఖముగా ఉండగలుగుతాము.

ఒకదానితో (బుద్ధితో) ఆలోచించి, రెండింటిని ( కర్తవ్యాకర్తవ్యములను ) నిర్ణయించి, నాలుగింటితో (సామదానభేదదండములతో) మూడింటిని (శతృ మిత్ర ఉదాసీనత్వములను ) వశమునందుంచుకొనుము. పచేంద్రియములను జయించి ఆరింటిని ( సంధి, విగ్రహయాన, ఆసన, ద్వైధీభావ, సమాశ్రయములను ) తెలుసుకుని ఏడు వ్యసనములను (స్త్రీ,జూదము,వేట,మద్యము,కఠినవచనములను, దండకాఠిన్యము,అన్యాయధనార్జనము ) వదిలివేసి సుఖముగా జీవించుము.