ప్రాణాయామం
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మనము ప్రాతః కాలములో కొద్దసేపైనా ప్రాణాయామం చేస్తే, అది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు అంటారు. అలాగే యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ధ్యానం ఇత్యాదివి మన దినచర్యలో భాగంగా చేసుకోవటం మన ఆరోగ్యానికెంతో మంచిది. ఈ మార్గాలన్నీ మన శారీరిక, మానసిక ఆరోగ్య వికాసానికి మన మహర్షులు సూచించినవి. ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఈ సత్యాన్ని అంగీకరిస్తోంది. ప్రతిరోజు కుదరపోయినా, కనీసం వారములో ఒక్కరోజైనా వీటిని ఆచరించటానికి ప్రయత్నిద్దాము.
సనాతన ధర్మం మనకి అందించిన విశిష్టమైన క్రియ ప్రాణాయామం. ప్రాణాయామం విశిష్టత గురించి గురుదేవులు ధర్మవాణిలో మనకి ఎంతో అద్భుతముగా వివరించారు.
మానవుడు తన జీవితాన్ని సంపూర్ణ ఆయుర్దాయముగా పరిగణిస్తే, 120 సంవత్సరాల ఆయుస్సు వరకు జీవించగలుగుతాడు అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 120 సంవత్సరాలు ఆంటే పది పుష్కరాల కాలము. ఒక పుష్కర కాలము తీసివేసినా, కనీసముగా మనిషి 100 సంవత్సరాల కాలం జీవించగలడు. ‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి’ అని వేదం పేర్కొంటోంది. పెద్దలు తమ ఆశీర్వచనములలో ‘శతమానం భవతి’ అని దీవిస్తారు. మనిషి తాను జీవించినంత కాలం కూడా ఆరోగ్యముగా జీవించాలని ఆశిస్తాడు. అందుకు దోహదపడేదే ప్రాణాయామం.
ప్రాణాయామం ఆంటే, ‘ఉఛ్వాస నిశ్వాసల నియంత్రణ’. ఉఛ్వాస ఆంటే, ‘శ్వాస పీల్చుకోవటం’, నిశ్వాస ఆంటే, ‘శ్వాస వదిలివెయ్యటం’. మన ఆయుస్సుకు, ఉఛ్వాస – నిశ్వాస నియంత్రణకు విశేషమైన సంబంధం ఉంది. సాధారణముగా మనము మన వయస్సును సంవత్సరాలలో, రోజులలో, లెక్కిస్తాము. ప్రతి సంవత్సరం పుట్టినరోజును జరుపుకుంటూ, మన వయస్సును సంవత్సరాలలో గుర్తుచేసుకుంటాము. కానీ భగవంతుడు ఉఛ్వాస నిశ్వాసల ద్వారా మన ఆయుస్సు ప్రమాణమును నిర్ణయిస్తాడు.
మనము జన్మించే ముందే భగవంతుడు మన ఉఛ్వాస – నిశ్వాసల ద్వారా ఆయుస్సును నిర్ణయిస్తాడు. ఉదాహరణకు ఈ జివి భూమ్మీద కోటి ఉఛ్వాస – నిశ్వాసాల ఆయుస్సుతో తిరుగుతాడు అని. ఆ లెక్క ముగిసిన వెంటనే మన ఆయుస్సు ముగిసినట్టే. మనము శ్వాస పీల్చటం ఆగిపోతే, అదే మరణం అంటున్నాము. ఆ సమయం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి, నిత్యం మరణం మన వెంటే ఉంటుంది అని పెద్దలు అంటారు. మన ఉఛ్వాస-నిశ్వాసలను నియంత్రించుకోగలిగితే, మన ఆయుస్సును మనము పొడిగించుకున్నట్టే. ఆ ప్రక్రియే ప్రాణాయామం. ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమే.
మనము ప్రతి రోజున సగటున 21600 ఉఛ్వాస – నిశ్వాసలు తీసుకుంటాము. ఒక రోజుకి (రాత్రి + పగలు) సగటున 1 ,13 ,180 సార్లు ఉఛ్వాస – నిశ్వాసలు ఉంటాయి అని యోగ శాస్త్రం పేర్కొంటోంది.

మనము ప్రాణాయామంలో గాలిని ఒక క్రమపద్ధతిలో మెలమెల్లగా ఎక్కువసేపు పీలుస్తూ, కొద్ది సేపు శ్వాసను నిలిపి, తిరిగి మెల్లిగా వదిలిపెడతాము. ప్రాణాయామంలో మూడు ప్రక్రియలు ఉంటాయి – పూరకము, కుంభకము, రేచకము. శ్వాసను పీల్చుకోవటం పూరకము, శ్వాసను కొద్దిసేపు లోపలనే నిలపటము కుంభకము, తిరిగి ఆ శ్వాసను వదలటం రేచకము. ఈ ప్రక్రియలో ఓంకారము కానీ మన ఇష్టదేవత మంత్రాన్ని గాని జపించాలి. ప్రాణాయామం వలన మనస్సు చంచలత్వమును మాని నిశ్చలంగా ఉంటుంది.
ప్రాణాయామం మానసిక ఒత్తిడి , ఆందోళనలను దూరం చేస్తుంది, శరీరానికి నూతన ఉత్తేజమును ఇస్తుంది. ప్రాణాయమాన్ని ఒక గురువు దగ్గిర అభ్యసించటం ఉత్తమం.

మన ఎడమ నాసికా రంద్రములో ఇడా నాడి (చంద్ర నాడి), కుడి నాసికా రంద్రములో పింగళ నాడి (సూర్య నాడి), రెండు కనుబొమలు మధ్యలో నాసికా అంతములో సుషుమ్న నాడి (బ్రహ్మ నాడి) ఉంటాయి అని నాడి శాస్త్రము పేర్కొంటోంది. ఈ నాడి మండలాన్ని ఉత్తేజపరుస్తూ, సరైన మార్గములో శ్వాసని నియంత్రించగలిగితే, ఎంతో కాలము ఆరోగ్యముగా జీవించగలుగుతాము. ప్రాణాయామముతో మన ఉఛ్వాస, నిశ్వాసాల సగటును దాదాపు సగానికి తగ్గించవచ్చు, తద్వారా మన ఆయుస్సును పొడిగించుకోవచ్చు.
ప్రాణాయామము సిద్ధించుకున్న వ్యక్తి వందలాది సంవత్సరములు ఆయురారోగ్యములతో హాయిగా జీవించునని శాస్త్రప్రమాణము. ఇప్పటికి హిమాలయాల్లో ఎన్నో వందల సంవత్సరాల వయస్సు ఉన్న యోగులు ఎందరో ఉన్నారు అని పెద్దలు చెప్తారు. ఆధునిక వైఙ్ఞానిక, వైద్య శాస్త్రాలు కూడా ‘ప్రాణాయామము’ యొక్క ప్రయోజనాన్ని ధృవీకరించాయి.