హనుమ రూపాలు – ప్రసన్నఆంజనేయస్వామి
హనుమంతులవారికున్న అనేక రూపాలలో ఒక విశిష్టమైన రూపం ‘ప్రసన్న ఆంజనేయస్వామి.’ ఆ రూపానికున్న విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
హనుమను మనము ‘వాయు పుత్రుడు’ అంటున్నాము. వాయువుకి ఒక రూపము ఉండదు. అలాగే హనుమకు కూడా ఒక రూపం అంటూ ఉండదు. రామాయణాన్ని అనుసరించి హనుమ రూపం వానరరూపం. అయితే హనుమ అసలు రూపం ఏమిటి? ‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిమ్ నమతా రాక్షసాంతకామ్ ||‘ – ఎక్కడ రామాయణం చెప్పబడుతుంటే, ఎక్కడ రామకథ వినపడుతుంటే, ఎక్కడ శ్రీరామకీర్తి గానం చెయ్యబడుతున్నదో అక్కడ ఏదో ఒక రూపములో హనుమ తప్పక దర్శనమిస్తారు. ఎక్కడ రామనామం వినపడుతూ వుంటుందో, అక్కడకి వచ్చి కూర్చుంటారు స్వామి. ఒకేసారి వెయ్యి చోట్ల, పదివేల చోట్ల దర్శనం ఇవ్వగల సమర్థులు హనుమ. ఈ జగత్తులో ప్రతి చోటా ఉండేది వాయువు. వాయుపుత్రులు హనుమ కావున వాయు రూపములో హనుమ కూడా అన్ని చోట్లా ఉంటారు. అందుకే హనుమ యొక్క అనేక రూపాలు మనకు దర్శనమిస్తాయి – ‘అభయాంజనేయస్వామి, ప్రసన్నఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి’, ఇలా అనేక రూపాలలో హనుమ మనకు కనిపిస్తారు.
హనుమ అనేక రూపాలలో తన భక్తులను అనుగ్రహిస్తారు. హనుమ రూపాలన్నిటిలో తొమ్మిది రూపాలు అతి విశిష్టమైనవిగా పరాశర సంహిత పేర్కొంటోంది. హనుమ నవరూపాలలో మొదటి రూపం ‘ప్రసన్నాంజనేయస్వామి’ రూపం. ‘ప్రసన్న ఆంజనేయుడు’ ఆంటే ఎవరు? ‘శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే‘ అని మనము శ్రీమహావిష్ణువును, గణపతిని ధ్యానిస్తాము. అలాగే హనుమను ‘ప్రసన్న ఆంజనేయుడు’ అంటున్నాము.
ప్రసన్నాంజనేయ స్వరూపములో స్వామి ప్రసన్నమూర్తిగా, అనుగ్రహమూర్తిగా గదాయుధమును ఒక చేతితో పట్టుకొని, మరొక చేతిలో అభయ ముద్రను ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ స్వామి అనుగ్రహాన్ని పొందినవారెందరో ఉన్నారు. విజయుడు అనే రాజు ప్రసన్నాంజనేయ స్వామిని ఉపాసించి, పూజించి, ఆ స్వామి అనుగ్రహముతో మరుజన్మలో అర్జనుడిగా జన్మించాడని పరాశరసంహిత పేర్కొంటోంది.
“శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం..“, అని ఆంజనేయ దండకములో హనుమను కీర్తిస్తాము. ‘ప్రసన్న’ ఆంటే సంస్కృతములో ‘దయకలిగినవాడు’ అని అర్థం. జాలి వేరు, దయ వేరు. జాలి ఆంటే, ‘అయ్యో పాపం అలా ఉన్నాడు అయిన’, అని భావించటం. ఉదాహరణకు మనము రోడ్డు మీద వెళ్తుంటే ఒక బిచ్చగాడు ఎదురైతే అతని మీద మనము జాలిపడతాము. దయగలగటం ఆంటే, ‘మన జేబులోనుంచి పది రూపాయలు తీసి అతనికివ్వటం’. అది దయ. ఆంజనేయస్వామికి ధర్మానువర్తకుల మీద అపారమైన దయ ఉంటుంది. ధార్మికులు, ధర్మ మార్గంలో సంచరించేవారు ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్నా హనుమ వారిని దయతో అనుగ్రహిస్తారు. ‘ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము’, ఇలా ధర్మానువర్తకులకు ఏ విషయములో ఏ ఇబ్బంది కలిగినా, హనుమ ఆ ఇబ్బందిని తప్పక తొలగిస్తారు. అందుకని ‘ప్రసన్న ఆంజనేయుస్వామి‘ (తన భక్తుల యందు దయ కలిగి ఉండి వారి బాధలను తొలగించే స్వామి) అన్నారు.
‘ప్రసన్న’ ఆంటే, ‘ప్రేమ స్వరూపం‘ అని కూడా అర్థం ఉన్నది. మనకి ఎవరి పట్ల అయితే ప్రేమ ఉంటుందో, వారికి మన సర్వస్వాన్ని ఇవ్వటాన్ని ఇష్టపడతాము. అలాగే హనుమ కూడా ఎవరైతే ధర్మమార్గములో ఉంటారో, వారి పట్ల ప్రేమకలిగి ఉండి, వారిని ఎల్లప్పుడు కాపాడుతూ ఉంటారు. అది హనుమకున్న మరో వైశిష్ట్యము. హనుమంతులవారిని ప్రసన్నులను చేసుకోవటానికి అతి సులువైన మార్గం ‘శ్రీరామకీర్తన.‘ మనము ఎవరినైనా కీర్తిస్తే, స్తుతిస్తే వారు సంతోషపడటం లోకములో సహజముగా జరిగేదే. అయితే హనుమ మాత్రం తనను కీర్తించటం కన్నా శ్రీరాములవారిని కీర్తిస్తే, స్తుతిస్తే ఎంతగానో ఆనందిస్తారు. హనుమ రామకథను ఎలా వింటారో ఎందరో పెద్దలు దర్శించి మనకందించారు. హనుమ తన రెండు చేతులు జోడించి, తలపై పెట్టుకొని, మనస్సులో శ్రీరామచంద్రమూర్తులవారిని ధ్యానిస్తూ, కళ్ళ నిండా ఆనందభాష్పలు వ్రాలుస్తూ, రామకథను వింటారు.
రామకథ చెప్పకపోతే, శ్రీరాములవారి గానమును వినకపోతే హనుమకు ఏమి తోచదు. హనుమకు తన గురించి చెప్పుకోవటం కన్నా శ్రీరాములవారిని గురించి గానం చెయ్యటం అమిత ఇష్టం. మనము పిలిచినా, పిలవకపోయినా, ఎక్కడైతే రామకథ గానం చెయ్యబడుతుందో, ఎక్కడైతే రామ కీర్తన వినపడుతుందో అక్కడ హనుమ తప్పక ఉంటారు. ఇది హనుమ స్వయముగా తనకు తాను శ్రీరాములవారిని కోరిన వరం, హనుమకు శ్రీరాములవారు అనుగ్రహించిన వరం. “ఓ రామా, ఈ భూమిపై నీ నామం వినబడుతున్నంత కాలం ఈ భూమండలాన్ని వదిలి నేను రాను’, అని శ్రీరాములవారితో పేర్కొంటారు హనుమ.
శ్రీరామనామం వ్రాసినా, శ్రీరామనామం పలికినా, స్మరించినా, శ్రీరామనామం విన్నా హనుమ ప్రసన్నులై మనలను అనుగ్రహిస్తారు. శ్రీరామభక్తులపై హనుమ ఎనలేని ప్రేమ కనపరుస్తారు, వారిని ఎల్లవేళలా రక్షిస్తారు.