నిందా స్తుతులను ఎలా స్వీకరించాలి
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
మానావమానాలకు, పొంగకు, క్రుంగకు, నిందాస్తుతులను సమంగాతీసుకో, అని మన పెద్దలు చిన్నప్పటినుంచి మనకి చెపుతూ వచ్చారు. భగవద్గీత లోని శ్లోకాలలో శ్రీకృష్ణభగవానుడు ప్రతి మానవుడు పెంపొందించుకోవాల్సిన లక్షణాలు ఎటువంటివో చెప్పియున్నారు. మనకి గురువుగారు ధర్మవాణి ద్వారా నిత్యజీవితంలో నిందాస్తుతులను ఎలా ఎదుర్కోవచ్చో తెలియజేసారు. ఒక్కసారి మననం చేసుకుందాం.
పరమార్ధ జ్ఞాననిష్ఠులు, అక్షర స్వరూపులు పాటించవలసిన లక్షణాలు ఎలాంటివో శ్రీకృష్ణపరమాత్మ గీతలో చెప్పిఉన్నారు.
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ ।
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః
“తుల్య నిందాస్తుతిః”, తుల్య అంటే సమానముగా. నిందాస్తుతిః అంటే నిందా స్తుతులయందు అంటే ఎవరన్నా స్తుతించినా, నింద చేసినా, సన్మానము చేసినా సమానముగా ఉండగలిగినవాడు అని అర్థం. ఎంత కష్టమండి ఇది. చెప్పటం, వినటం రెండు తేలికే, ఆచరించాలంటేనే కష్టం. ఎవరన్నా ఏమన్నా అంటున్నారెమో అంటేనే వెంటనే లోపల నేనున్నాననే భావన పైకి లేస్తుంది. అది పనికిరాదు అని శ్రీకృష్ణపరమాత్మ పేర్కొంటున్నాడు.
“తుల్య నిందాస్తుతిః” – నిందా స్తుతులను (ఎవరైనా నిందచేసిన ,స్తుతించినా, పొగిడినా, తెగిడినా) సమానమైన భావనతో ఉండగలగాలి. ‘నిందా స్తుతుల యందు సమానముగా ఉండటం నేర్చుకో అర్జునా’, అని శ్రీకృష్ణులవారు పేర్కొంటున్నారు.
మునిలాగా ఉండాలి అని గీతా వాక్కు. ముని అంటే వాంగ్మయము గలవాడు.
వాక్కు నందు మునిలాగా ఉండాలి. ముని అనగా వాక్కును వశ మందు ఉంచుకొనుట. వాక్కును ఎవరు అదుపులో ఉంచుకుంటారో వారు మునులు. ‘మునులు మాట్లాడారు,మూర్ఖులు వాదిస్తారు.’ అని ఒక సామెత. వాక్కును నియంత్రించుకోవడం ఒక సాధనా మార్గం. అందుకే మౌన వ్రతం పాటించమని పెద్దలు చెపుతుంటారు. ఆ ఒక్కరోజన్నా మాట్లాడకుండా ఉంటే, ఆ ఒక్క గంట అయినా మాట్లాడకుండా ఉంటే వాక్కు యందు నియంత్రణ ఏర్పడుతుంది.
”సంతుష్టో యేన కేనచిత్ ”, అంటే ఏ కొంచెం లభించినా కూడా సంతుష్టిని పొందాలని అర్ధం. మహాభారతములో శాంతిపర్వంలో చెప్తారు. ‘యేన కేనచిదాచ్ఛన్నో యేనకేనచి దాశితః । యత్ర క్వచన శాయీ స్యాత్ తం దేవా బ్రాహ్మణం విదుః’ – లభించిన దానితో దేహాన్ని కప్పుకొని (ఇతరులు ఎవరైనా ఇచ్చిన వస్త్రముతో), ప్రాప్తించిన దానిని ఆరగించి, ఎక్కడో ఒక చోట శయనించి కాలాన్ని వెళ్ళబుచ్చే మహాత్ముడు, బ్రాహ్మణుడు అని దేవతలు భావిస్తారు అని మహాభారతములో గల శాంతిపర్వములోని సూక్తి.

దేని మీద అటాచ్మెంట్ లేకుండా ఉండటం, నియమముగా ఒక నివాస స్థానము లేని వాడు, అక్కడే ఉండాలి, అందులోనే ఉండాలి అనే ఆలోచన లేని వాడు, ఏది దొరికితే దానితో సంతుష్టిని పొందాలని,స్థిరబుద్ధి కలిగి ఇండాలని,అలాంటివారు సందేహం లేకుండా పరమాత్మకు,అనగా భగవంతునికి ప్రీతి పాత్రునిగా ఉండగలుగుతారని ,అలాంటివారు అన్నిటి యందు తిరుగులేని విజయాలను పొందుతారని ధర్మవాణి ద్వారా మనకి గురువుగారు ఒక సాధనా మార్గాన్ని మనముందుంచారు. పాటిద్దాం,తరిద్దాం.🙏