లక్ష్య సాధన – ధృతి
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
లక్ష్య సాధన కొరకు సనాతన ధర్మములో చాలా సంధర్భాలలో మనకు మార్గదర్శనం చేసి ఉన్నారు మన మహర్షులు. వేదాల్లో, పురాణాల్లో, శృతులలో, స్మృతులలో, శాస్త్రాలలో, అనేక గ్రంధాలలో, వేరు వేరు సందర్భాలలో మానవుడు తాను నిర్థేశించుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి (అది మోక్షమే కావచ్చు, చతుర్విద పురుషార్దలలో అర్థము కావచ్చు, కామము కావచ్చు) అని మహర్షులు వివరించటం జరిగింది.
దేని విషయములో లక్ష్యము పెట్టుకున్నా ఆ లక్షాన్ని సాధించటానికి మానవునికి కావాల్సినవి నాలుగు లక్షణాలు అని మనకి తెలియవస్తుంది. ఏమిటా నాలుగు అంటే ధృతిః, దృష్టిః, మతిః, దాక్ష్యం. మొట్టమొదటిది ధృతి ఉండాలి. దృతి అంటే ధైర్యము. మనము ఉన్నటువంటి స్థితి నుంచి చేరుకోవాల్సిన స్థితి చాలా గంబీరముగా ఉండచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో అది మనకు సాధ్యమా అనే సందేహం కూడా కలిగేలా లక్ష్యము చాలా దూరము ఉండవచ్చు. ఉదాహరణకి సుందరకాండలో నూరు యోజనాల సముద్రాన్ని దాటటానికి హనుమంతులవారు ధైర్యాన్ని ప్రదర్శించి, మిగితా వానరులంతా ‘మేము చేయలేము, మా వల్ల కాదు’, అన్నటువంటి సందర్బములో ఆయన ‘నేను చెయ్యగలను’ అని ముందుకు వచ్చారు. ఆ దైర్యం కావాలి.
చాలా సందర్భాలలో లౌకికముగా కూడా మనము ఆలోచిస్తే, లక్ష్యము చాలా దూరముగా ఉన్నట్లు మనకనిపిస్తుంది. ఇది సాధ్యమా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే ధైర్యము చేస్తారో, ఆ దైర్యం చేసినవారికి ‘ధైర్యే సాహసే లక్షి’ అన్నారు. ఆ ధైర్యముతో ఆ లక్ష్యాన్ని సాధించే అవకాశము దానంతట అదే లభిస్తుందని మనకి సనాతన ధర్మం తెలియజేస్తోంది, కాబట్టి మొట్టమొదటి లక్షణము ధృతి. ధృతి అంటే ధైర్యము. “నేను చేయగలను, నా వల్ల అవుతుంది. ఎందువల్ల నాతో కానిది వేరొకరితో అవ్వటానికి అవకాశం లేదు. వేరొకరితో అయ్యేది నాతో కాకుండా పొయ్యే అవకాశం లేదు. కనుక ఒకరు చేయగలిగారు అంటే నేను కూడా చెయ్యగలను. నేను చెయ్యలేకపోతే ఎవరూ చెయ్యలేరు. ఎవరు చెయ్యలేని పని ఈ సృష్టిలో ఉండే అవకాశం లేదు”. కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో “నేను సాధించగలను, నా వల్ల జరుగుతుంది”, అనే దృఢసంకల్పం కలుగుతుంది. దాన్ని determination , strong will అంటాము. ఆ ధృతి కనుక ఉంటే, ఆ నిర్ణయం తీసుకుంటే మార్గాలు వాటంతట అవే గోచరిస్తూ ఉంటాయి.

మానవుడు సర్వసమర్దుడు, సర్వదా శక్తిమంతుడు, ఏదన్నా సాధించగలడు.
‘గ్రహరాశులనధిగమించి ఘనతారల పథమునుంచి గగనాంతర రోదసిలో.. ఓ.. గంధర్వగోళకతుల దాటి చంద్రలోకమైన… దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగేవాడు మానవుడు’ అని ఒక కవి పేర్కొన్నట్టు, మానవుడికి సాధ్యం కానిదేది లేదు. ఒకవేళ మానవునికి సాధ్యం కానిదేమైనా ఉంటే, అది మన మనస్సులోనే ఉంటుంది.
భగవంతుడు మనిషికి పుట్టుక తోనే మూడు రకాల శక్తులు ఇచ్చాడు. అవి ఒకటి ఇచ్చా శక్తి, రెండు జ్ఞాన శక్తి, మూడు క్రియా శక్తి. ఇచ్చా శక్తి, కావాలి ముందు. తరువాత జ్ఞాన శక్తి,క్రియా శక్తి ఒకదానివెంట మరొకటి వస్తాయి. ఇచ్చా శక్తి అంటే ‘నేను చేస్తాను, నేను చెయ్యాలి, నాకు కావాలి, దీని వల్ల నాకు ఈ ప్రయోజనం కలుగుతుంది’ అని ఆలోచన, భావన ఉంటే ఒక బలమైన కోరిక కలుగుతుంది తద్వారా మనకు దైర్యం లభిస్తుంది. కనుక ధృతి ముందు.
ధృతి గనుక ఏర్పరుచుకుంటే మానవుడు సాధించలేనిది అంటూ ఏమి లేదు, తప్పకుండా సాధిస్తాడు. కాబట్టి ధృతి. ధృతితోటి ఏ కార్యమునైన సాధించగలరు, ఆ ద్రుతిని అలవాటు చేసుకోండి అని సనాతన ధర్మం మనకు తెలుపుతూ ఉంటుంది.