లక్ష్య సాధన – మతి
Dharma Vaani – K C Das Memorial Charitable Trust
సాదారణముగా మనకు ఉండే అపోహ ఏమిటంటే “పురాణాలు, శాస్త్రాలు మనల్ని ఏ పని చెయ్యవద్దని, ముక్కుమూసుకొని ఒక పక్కన కూర్చొని ఉండు”, అని పేర్కొంటాయి అని. కానీ అది పూర్తిగా తప్పు. “ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యవద్దు”, అని శాస్త్రం పేర్కొంటోంది. గీతలో కూడా శ్రీకృష్ణపరమాత్మ మనకు ఇదే విషయాన్ని తెలుపుతారు. “నువ్వు ఖాళీగా ఉండవద్దు, యుద్ధం చెయ్యి, నీ ధర్మం నువ్వు నిర్వర్తించాల్సినదే”, అని శ్రీకృష్ణులవారు పేర్కొంటారు. “కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చెయ్యి”, అని మన ధర్మం పేర్కొంటుంది అని మనకుండే అపోహ. అజ్ఞానముతో చేసే ఆలోచన అది. మంత్రశక్తిని ప్రేరేపించటానికి చెప్పిందే తపస్సు అంటే. శక్తులు మూడు రకాలుగా ఉంటాయి – యంత్ర శక్తి, తంత్ర శక్తి, మంత్రం శక్తి. అదే ఇచ్ఛ శక్తి, జ్ఞాన శక్తి, క్రియ శక్తి అంటాము. జ్ఞానశక్తిని పెంపొందించేదే తపస్సు.
లక్ష్యసాధన కొరకు చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి శాస్త్రములో. మానవుడు తనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాక, (అది విద్యార్ధి దశలో ఉన్నపుడు చదువు, పరీక్షల్లో ఉత్తీర్ణత, ర్యాంకులు సాధించటం, ఆ తరువాత యవ్వన దశ అంకురించగానే ఉద్యోగం సాధించటం, లేదా దొరికినటువంటి ఉద్యోగములో ప్రమోషన్ సాధించటం, ఇంకొంచము మంచి ఉద్యోగము సాధించటం, చేస్తున్న వ్యాపారములో విశేషమైన అభివృద్ధిని సాధించాలని లక్ష్యసాధన చేసుకోవటం ఇత్యాదివి), ఆ లక్ష్యాన్ని సాధించటం కోసం కృషి చేస్తాడు. ఈ లక్ష్యము మారుతూ ఉంటుంది. మనిషి మారుతున్న దశలో లక్ష్యం కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక వృదప్యములో ఉండదు. అలాగే విద్యార్ధి దశలో చదువు మీద ద్రుష్టి పెట్టకపోతే, వృద్దాప్యం వచ్చాక చదువు మీద అసలు ద్రుష్టి పెట్టలేదు. అందుకే ఏ వయస్సుకు ఆ ముచ్చట అని శాస్త్రం పేర్కొంటోంది.
లక్ష్యం అంటూ ఒకటి ఏర్పరుచుకుంటే, ఆ లక్ష్యాన్ని సాధించటానికి కావాల్సిన మూడవ లక్షణం మతి. మతి అంటే బుద్ది. ‘బుద్ధిర్బలం యశోధైర్యం..’, ‘బుద్ధిమతాం వరిష్ఠమ్’, అని మనము హనుమంతులవారిని కీర్తిస్తాము. సమాయనుకూలముగా, ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో, ఆ నిర్ణయానికి అనుగుణముగా మనిషి ప్రవర్తన ఉంటే, ఆలోచనావిధానము ఉంటే, విశ్లేషణా జ్ఞానము ఉంటే, విశ్లేషణా తీరు ఉంటే, ఆ యొక్క బుద్ది లక్ష్యసాధనకు ఉపయోగిస్తుంది. చేసేటటువంటి పనుల సమాహారమే చివరకు వచ్చిన ఫలితము.

ఒక రాయి పగలాలంటే ఒక దెబ్బతో పగలదు. దానికి నూరు దెబ్బలు కొట్టాలి. ఉదాహరణకు నూరు దెబ్బలు కొట్టినా ఒక రాయి పగులలేదని వదిలేసి వెళ్ళిపోతాడు ఒక మనిషి. లక్ష్యసాధన యందు ద్రుష్టి లేకపోతే, మతి లేకపోతే జరిగేటటువంటి ఫలితాలు ఇలా ఉంటాయి. 99 దెబ్బలు కొట్టి ఆ వ్యక్తి వెళ్లిపోయిన తరువాత ఎవరో ఒకరు వచ్చి ఒక్క దెబ్బకే ఆ రాయిని పగలకొడతారు. కాబట్టి మతి అంటూ ఒకటి ఆలోచిస్తే, అంటే మనస్సులో ఉండే మేధా శక్తి. అటువంటి మేథస్సును భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మీ పనులు నెరవేర్చుకొండి అని ఆయన చెప్తున్నాడు. బాహ్యకమైన విషయజ్ఞానము (అజ్ఞానము) తోటి తన యొక్క మతిని కప్పివేస్తే లక్ష్యసాధన తేలికగా జరుగదు, కష్టసాధ్యమై పోతుంది.
కాబట్టి భగవంతుడు మనకు ఇచ్చిన బుద్ధికి సద్వినియోగపరుచుకుందాము, లక్ష్యసాధనలో ఆ బుద్దిని వినియోగిద్దాము, ఆ లక్ష్యాన్ని అందుకుందాము.