భగవత్ గీత అధ్యయనం – దైవాసురసంపద్విభాగ యోగః 13
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః
::శ్రీమద్భగవద్గీత::
అథ షోడశోధ్యాయః ( పదహారవ అధ్యాయం)
దైవాసురసంపద్విభాగ యోగః
ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ || 13 ||
భావం: ఆసురీ సంపద కలిగిన వారి మనస్తత్వం ఇలా ఉంటుంది: “నా కోరిక ఇప్పుడే నెరవేరింది, భవిష్యత్తులో కూడా నా కోరికలను నెరవేర్చుకుంటాను; నా దగ్గర ఇప్పుడు సంపద ఉంది, ఇంకా సంపాదించి మరింత ధనవంతుడిని అవుతాను.”
భగవంతుడు అటువంటి ఆసురీ స్వభావం గలవారి మనస్తత్వాన్ని తదుపరి రెండు శ్లోకాలలో (14 మరియు 15) వివరిస్తూ కొనసాగిస్తున్నారు.
నైతికత్వాన్ని పూర్తిగా విస్మరిస్తూ, తమకేది నచ్చితే దానిని అనుభవించే హక్కు తమకుంది అని ఆసురీ లక్షణములు కలవారు అనుకుంటారు. తన స్వప్రయోజనాలు నెరవేరటం కోసం పరిస్థితులను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వైదిక కర్మ కాండలు తమకు భౌతిక సంపత్తిని కలుగచేస్తాయి అని తెలుసుకుని, వారు కీర్తి సంపదల కోసం యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తుంటారు. కానీ, ఎట్లైతే రాబందు ఎత్తులో ఎగిరినా దాని చూపు క్రిందికే నిమగ్నమై ఉంటుందో, ఆసురీ స్వభావము కలవారు కొన్నిసార్లు సమాజంలో ఉన్నతహోదాకి ఎదుగుతారు, కానీ వారి పనులు నీచమైనవిగా మరియు నిమ్నస్థాయిలో ఉంటాయి. ఇటువంటి వారు అధికారాన్ని గౌరవిస్తారు మరియు ‘అధికారంతో ఏమైనా చేయొచ్చు’ (might is right) అన్న సూత్రాన్ని నమ్ముతారు. కాబట్టి, వారి కోరికలను తీర్చుకునేందుకు ఉన్న అవరోధాలను తొలగించటానికి ఇతరులకు హాని చేయటానికి లేదా గాయపరచటానికి కూడా వెనుకాడరు.
బతృహరి సూక్తి సుధాకరం నాలుగు రకాలైన మనుష్యులను పేర్కొంటుంది:
ఏకే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే
సామాన్యాస్తు పరార్థముద్యమభృతః స్వార్థావిరోధేన యే
తే ఽమీ మానవ రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి యే
యే తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే న జానీమహే
‘మొదటి రకం మనుష్యులు సాధు పురుషులు, వారు ఇతరుల సంక్షేమం కోసం తమ స్వార్థ-ప్రయోజనాన్ని వదిలి పెడతారు. రెండవ రకం మనుష్యులు, సాధారణమైన వారు, వీరు, తమకు హాని/నష్టం కలగనంత వరకూ, ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తారు. మూడవ రకం మనుష్యులు ఆసురీ గుణాలు కలవారు, వారి స్వార్థ-ప్రయోజనం నెరవేరుతుంది అంటే, ఇతరులకు హాని చేయటానికి వెనుకాడరు. ఇక, నాల్గవ రకం మనుష్యులు కూడా ఉంటారు, అకారణంగా ఇతరులను బాధ పెడ్తుంటారు (శాడిస్టిక్ ఆనందం). వారికి సరిపోయే పేరు కూడా లేదు.’ శ్రీ కృష్ణుడు నీచమైన ఆసురీ ప్రవృత్తి గల వారిని ఇక్కడ స్పష్టముగా వివరిస్తున్నాడు. గర్వముతో కళ్ళు మూసుకుపోయి, వారు ఈ విధముగా అనుకుంటారు: ‘నేను ఒక ఐశ్వర్యవంత రాజరిక కుటుంబంలో పుట్టాను. ధనవంతుడను మరియు బలవంతుడను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. భగవంతుని ముందు మ్రోకరిల్లాల్సిన అవసరమూ నాకు లేదు ఎందుకంటే నేనే దేవుడి లాంటి వాడిని’ అని.
జై శ్రీ కృష్ణ
ధర్మో రక్షతి రక్షితః