శ్రీమద్రామాయణం – వాల్మీకి మహర్షి
సన్మార్గంలో మనం రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తిత్వముల గురించి, తద్వారా ప్రస్తుత మానవాళికి, ప్రస్తుత సమాజానికి లభించేటువంటి సందేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రామాయణ సృష్టికర్త అయినటువంటి వాల్మీకి మహర్షుల గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఆయన జీవితంలో నుండి మనం నేర్చుకోవలసింది ఒక ముఖ్య అంశం మనకు కనబడుతుంది ‘కృషితో నాస్తి దుర్బిక్షం, జపతో నాస్తి పాతకం’.
వాల్మీకి మహర్షి – రామాయణ రచన:
సనాతన ధర్మంలో మనకి ఒక ఆర్యోక్తి ఉన్నది – ‘కృషితో సాధించలేనటువంటిది ఏదీ లేదు’. ఈ సృష్టిలో ఏది సాధించాలన్నా పురుష ప్రయత్నం తప్పనిసరి. ‘షడ్జిత్ పురుష ప్రయత్నేన సప్తజిత్ దైవ చింతనం’, అంటుంది శాస్త్రం. అంటే ఆరు వంతులు పురుష ప్రయత్నం ఉండాలి, అంతేగాని భగవంతుడి మీద భారం వేసి ‘నువ్వే చేయాలి’, అంటే ఆయన చెయ్యడు. ప్రతి మనిషి తనకున్నటువంటి లక్ష్యము తన జీవన విధానానికి అనుగుణంగా తాను ఏర్పరచుకొని, దానికి తగ్గట్టుగా కృషి చేయడానికి సిద్ధపడితే ఈ సృష్టిలో సాధించలేనిది అంటూ ఏమీ లేదు.
ఇవాళ మానవుడు గ్రహరాశులను దాటి, తారలన్నిటిని దాటుకొని, గగనాంతర రోదశిలో గంధర్వ గోళాలన్నీ కూడా దాటి, చంద్రలోకమైనా, ఏ లోకమైనా కూడా వెళ్లి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుని మళ్ళీ వెనక్కి రాగలుగుతున్నాడు. మనిషి ఏం సాధించగలడు అనేటువంటిది మహర్షి వాల్మీకి చరిత్ర నుండి మనకు కనబడుతుంది.
‘ఆది కవిత వాల్మీకి ప్రణీతము నారదునకు పారాయణ భరితము’, అంటారు. నిరంతరము హరినామ స్మరణ చేసేటువంటి నారదుడు లాంటి వాడు కూడా పాడుకోవడానికి వీలుగా ఒక గ్రంథమును ఆవిష్కరించారు.
‘ఆది కవిత’, అని పేరు. శ్లోకాల రూపంలో అప్పటిదాకా ఎవరు చెప్పలేదు, రామాయణంతో ప్రారంభం చేసింది ఆయన.
వ్యాకరణంలో ఉండేటువంటి అంశాలన్నిటిని చేకూర్చి, ఒక కావ్యానికి కావలసిన లక్షణాలు ఏముంటాయో అవన్నీ పెట్టి మనకందించారు వాల్మీకి మహర్షి. ఇవాల్టికి కూడా కవులందరూ రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఉపమాన ఉపమేయములను (Examples) తీసుకొని మళ్ళీ Represent చేస్తున్నారు. ఆయన ఆనాడే ఆలోచించి ఇవన్నీ కూడా జొప్పించి, నవరసాలు దాంట్లో కుప్పించి, అందరినీ ఆనందపరిచే విధంగా రామాయణ రచన చేశారు.
వాల్మీకి మహర్షి నుంచి గ్రహించాల్సిన లక్షణాలు
రామాయణంలో ఉన్నటువంటి వైశిష్ట్యం అంతా వాల్మీకి మహర్షి రాసుకుంటూ వచ్చారు కానీ తన చరిత్ర తాను ఎక్కడా చెప్పుకోలేదు, తన గురించి తానేమీ రాసుకోలేదు. మనకి వేరు వేరు చోట్ల కనబడుతుంది, వేరు వేరు కథల రూపంలో ఉన్నాయి. ఒక కిరాతకుడుగా ఉండేవాడని అక్కడి నుంచి మారాడని. ఈ మార్పు కూడా మనకి ఒక సందేశాన్ని అందిస్తుంది.
మనిషి పూర్వం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, మంచి కొరకు మారాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే విశ్వానికి మేలు చేసే స్థాయికి ఎదిగిపోగలడు. కానీ దానికి కావలసినటువంటి ‘కృషి’ చేయాలి. ఆ కృషి చేస్తే (Hard Work) ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళు అయినా సరే, ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అని మహర్షి వాల్మీకి జీవితం నుండి మనకి సందేశం అందుతుంది.
అలాగే మరొక విషయం వాల్మీకి జీవితం నుండి మనం తెలుసుకోవాల్సింది ‘కారుణ్యము’. వాల్మీకి పరమ కారుణ్యమూర్తి. దయ వేరు, కారుణ్యము వేరు, జాలి వేరు. జాలి అంటే ఒక దీనావస్థలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ‘అయ్యో పాపం అనుకోవడం’. అయ్యో పాపం అని చేతనైన సహాయం చేయడం దయ.
అయ్యో పాపం అని చేతనైన సహాయం చేయడానికి అవకాశం ఉన్నంతవరకు చేస్తూ అతన్ని బాగుపరిచేదాకా దాని గురించే చింతించటం ‘కారుణ్యం’ అంటారు. ఎవరో బోయవాడు కొట్టినటువంటి బాణానికి విలవిలలాడుతున్నటువంటి ఒక పక్షిని చూసి తన మనసులో ద్రవించినటువంటి బాధ కలిగి, మరువలేకుండా ఉన్నటువంటి కారుణ్యముతో ఆయన విలపిస్తూ ఉంటారు. ఆ కారుణ్యంలో నుంచి పుట్టినటువంటిదే ‘రామాయణం’.
‘కరుణ’ అనేటువంటిది మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది అని మనకి మహర్షి వాల్మీకి చరిత్ర నుండి కనబడుతుంది. ఈ కారుణ్యంతోనే తర్వాత లవకుశులను చేరదీయడము, సీతమ్మ వారిని చేరదీయడము, లవకుశులను పెంచడము. సమస్త విశ్వమానవుల యందు కలిగినటువంటి కరుణ, ఆయన చూపించినటువంటి కరుణ వల్లే మనకి ఇవాళ రామాయణం లభ్యమవుతున్నది. కారుణ్యం (Compassion) మహర్షి వాల్మీకి జీవితంలో మనకు వేరు వేరు సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది.
మహర్షి వాల్మీకి చరిత్ర నుండి మనం తెలుసుకోవలసింది ‘పట్టుదల’ అంటే ‘కృషి’. కృషి ఉంటే ఎంతటి మనిషి అయినా ఋషి అవుతాడు.
అలాగే వాటితో పాటు ‘కారుణ్యం’ కూడా ఉండాలి. తోటి మనుషుల పట్ల, సమస్త జీవుల పట్ల, సకల జీవుల పట్ల కారుణ్యంతో ఉండగలిగితే, వారు ఋషి, మహర్షి అవుతారు, సమాజానికి హితవు చేసినటువంటి వారు అవుతారు. అలా జీవించే వారు సన్మార్గంలో నడుస్తూ ఉంటారని మనకి మహర్షి వాల్మీకి చరిత్ర ద్వారా తెలియవస్తుంది. ధర్మస్య విజయోస్తు.