శ్రీమద్రామాయణం – రామభక్త హనుమాన్
రామాయణం అనే మాలలో రత్నం వంటి వారైనా ఆంజనేయ స్వామి నుండి మనము నేర్చుకోవలసినటువంటి పాఠముల గురించి, ఆయన నడవడిక మనకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
పరోపకారం
హనుమంతుడు “రామ పూజారి, పరోపకారి, మహావీర బజరంగబలి”, అంటారు. పరులకు ఉపకారం చేయడం కోసమే హనుమంతుడు ఉన్నాడా అనిపిస్తుంది.
హనుమత్ చరిత్ర మనం చూసినట్లయితే రామాయణంలో బాలకాండలో, అయోధ్యకాండలో, అరణ్యకాండలో గాని హనుమ ప్రసక్తి ఉండదు. ఆయన్ని ప్రవేశపెట్టడం పెట్టడమే కిష్కింధకాండలో మొదలు పెడతారు. కిష్కింధకాండలో హనుమంతుడిని ప్రవేశపెట్టి, వాల్మీకి మహర్షి ప్రారంభంలోనే సుగ్రీవుడికి సహకారం అందించడానికి గాను వెళ్తున్నాడు అని చెప్తారు.
సుగ్రీవుడికి ఉపకారం చేయడం కోసం “రామమిలాయ రాజపద దీన్హా”, అని సుగ్రీవుడిని రాజును చేయడానికి ఆయన రామలక్ష్మణులను సుగ్రీవుడికి మైత్రి చేయిస్తారు.
ఆ తర్వాత రాముడికి సహకారం అందించడం కోసం, సీతను వెతకడం కోసం నూరు యోజనముల సముద్రమును దాటుతారు. ఎవ్వరి వల్ల కానటువంటి పని ఆయన ఒక్కడే చేసి చూపిస్తారు. అంత చేసినటువంటి స్వామి ఏమాత్రము అహంకారం లేకుండా ‘నేను చేశాను’ అనేటువంటి భావన లేకుండా “దాసోహం కౌసలేంద్రస్య” (రాముడి యొక్క దాసుడు) అంటారు. అది ఆయన యొక్క వినయానికి అద్దం పడుతుంది.
ఎంత కష్టమైనటువంటి పని అయినా, మనం పరుల కొరకు సహాయపడుతూ “పరోపకారార్థం ఇదం శరీరం” అనే భావనతో జీవించాలి అని హనుమ ద్వారా మనము గ్రహించాలి. “నీ వరకు నువ్వు ఎలాగో చూసుకుంటావు. నీ గురించి నువ్వు ఎలాగో జాగ్రత్తలు తీసుకుంటావు. నీకు ఏం కావాలో నువ్వు ఎలాగో చేసుకుంటావు. పశువులు, పక్షులు కూడా తమకు ఏం కావాలో అవి ఏర్పరచుకుంటాయి. మనిషిగా పుట్టినందుకు మానవుడు చేయవలసింది ఏమిటి అంటే ‘పరోపకారము’”. ‘నీ వరకు నువ్వు చూసుకుంటూ, పరులకు నువ్వు ఏ విధంగా ఉపయోగపడగలవు’, అనేటువంటిది ఆలోచన చెయ్యాలి.
పరోపకారము అంటే డబ్బే ఇవ్వక్కర్లేదు అందరికి. ‘నీకు భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో ఉదాహరణకు శ్రద్ధ ఇచ్చుంటే ఆ శ్రద్ధను అందించు, మేధస్సు ఇచ్చుంటే ఆ మేధస్సును పంచిపెట్టు. అలాగే సంపద కలిగితే ఆ సంపద లేని వారికి కొద్దిగా ఇచ్చి ఆదుకో’. ‘భగవంతుడు నీకు ఏమి ఇచ్చాడో దాన్ని పరుల కొరకు వినియోగించు’.
స్వామి హనుమ తన శక్తి సామర్థ్యాలను రాముడి కొరకు వినియోగించి, నూరు యోజనముల సముద్రము దాటి, సీతమ్మ వారి దగ్గరికి వెళ్లి సీతమ్మ కష్టములను తొలగించేటువంటి ఊరడించేటువంటి మాటలు చెప్పి, సీతకు ఉపకారం చేస్తారు. ఇది స్వామి హనుమకి ఉన్న పరోపకార గుణానికి ఇక ఉదాహరణ మాత్రమే.
కృతజ్ఞత
మరొక లక్షణం. విభీషణుడు రావణుడికి ధర్మబోధ చేసి, ఆయన ఈయన చెప్పినటువంటి ధర్మబోధ పట్టించుకోకపోతే, (వినాశకాలే విపరీత బుద్ధే) విభీషణుడు వేరైపోయి రాముడి దగ్గరికి వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్త వానర జాతి (నలుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, మైంద్రుడు, ద్విధుడు ఇలా రకరకాలుగా ఉన్నవారు) ముఖ్యులు కూడా విభీషణుడిని వ్యతిరేకిస్తారు. “రామా! ఇతను రాక్షససేన తరఫున గూఢచారిగా వచ్చాడు, మనం తీసుకోవద్దు”, అంటారు. ఒక్క హనుమ మాత్రం తనకు ఉన్నటువంటి బుద్ధి చేత ఆలోచన చేసి విభీషణుడిని సమర్థిస్తాడు.
తాను లంకలో ఉన్న సమయంలో ఇంద్రజిత్ వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణ సభకు వెళ్ళినప్పుడు కోపోద్రిక్తుడైనటువంటి రావణుడు “ఈ వానరుడిని సంహరించండి”, అని ఆజ్ఞ ఇస్తే వెంటనే అక్కడ లేచి మాట్లాడింది విభీషణుడు అని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ మాట్లాడటం కూడా ఏం మాట్లాడాడు అంటే, “ధర్మమును బోధ చేస్తాడు”. దూతను సంహరించరాదని రావణుడికి భోదిస్తాడు. రావణుడు ఆ మాట వింటాడు.
ఆ తరువాత రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించటం, లంకా దహనం జరగటం ఇత్యాదివన్నీ మనకు తెలిసినవే. హనుమంతుల వారు ఈ విషయం గుర్తు చేసుకుంటారు. “కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతనః” అంటుంది శాస్త్రం. మనకి ఎవరైనా మేలు చేస్తే, ఆ చేసిన మేలు మరువరాదు అని ఈ ఘట్టం నుండి హనుమ జీవితం ద్వారా మనకు సందేశం అందుతుంది.
వెంటనే ఆయన రాముల వారితో అంటారు, “రామా! ఆ రాక్షస సమూహంలో ధర్మజ్ఞుడైనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క విభీషణుడే. అలా ధర్మం మాట్లాడగలిగినటువంటి వాడు అవకాశవాదం చేసే అవకాశం లేదు కదా. రామా ఆలోచించవలసింది, నిర్ణయం మీది”, అంటాడు.
తద్వారా రాముడు విభీషణుడిని తన అంతరంగికుడిగా తీసుకొని, “ఇప్పుడే లంకకు రాజుని చేస్తున్నాను నిన్ను”, అని ప్రకటిస్తాడు. అంటే హనుమంతుల వారి సహాయం ఎవరికి లభిస్తుందో వారి కోరికలన్నీ తీరుతాయి.
పరోపకారం కోసం ఉన్నటువంటి వ్యక్తిగా ఇంత చేసిన హనుమంతుడు మనం చూస్తే గనుక తన కోసం ఎవ్వరిని ఏమి అడగలేదు. ఉదాహరణకు సుగ్రీవుడిని అడిగి ఉంటే కిష్కిందా రాజ్యంలో సగభాగం ఇచ్చి ఉండేవాడు, లేదా విభీషణుని అడిగి ఉంటే లంకలో సగభాగం ఇచ్చి ఉండేవాడు, రాముడిని అడిగి ఉంటే సమస్త రాజ్యమే ఇచ్చి ఉండేవాడు. కానీ తాను ఏమీ ఆశించకుండా పరుల కొరకు తన జీవితాన్ని గడుపుతూ ఈ విధంగా మనకి సందేశాన్ని అందిస్తారు.
కార్య సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు
అటువంటి మహానుభావుడి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. కార్యసాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో మనకి సుందరకాండలో కనబడుతుంది. నూరుయోజనల సముద్రము దాటేటప్పుడు వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు “దృతిర్దిష్టి మతిర్దాక్షం”. ఈ నాలుగు లక్షణాలు హనుమకు ఉన్నాయి.
ఈ నాలుగు లక్షణాలతో అతను కార్యమును సాఫల్యము చేసుకున్నాడు అంటారు. దృతి అంటే ‘పట్టుదల’. పట్టుదలకు ఇంకొక మెట్టు ఎక్కువ, Determination అంటాం మనం. కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో హనుమ జీవితం నుండి మనకు అర్థమవుతుంది. ఏదైనా పని సాధించాలి అంటే ముందు దాని యందు పట్టుదల ఉండాలి. “పట్టు పట్టగ రాదు పట్టి విడవగరాదు పట్టెనేని బిగియ పట్టవలెను”, అంటారు.
ఏదైనా పని మొదలు పెట్టాము అంటే సంకల్పం చేసేటప్పుడే దాంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు అన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. “ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై”, అన్నట్లుగా అసలు ప్రారంభించకుండా ఉండడం అవలక్షణం.
అయితే ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టడం మరొక దుర్లక్షణం. ఈ రెండూ కాకుండా కార్యసాఫల్యతను గురించి ఆలోచించాలి అంటే దృతి అంటే Determination ఉండాలి, పట్టుదల ఉండాలి మనిషికి. అది మనకి హనుమ జీవితం నుండి కనబడుతుంది. ఆ తర్వాత దృష్టి అంటే Vision.
మన భాషలో చెప్పుకోవాలంటే “Begin With an end in mind” అంటారు. ‘ఏదైనా పని ప్రారంభించేటప్పుడు దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మనం చూడగలగాలి’, అని హనుమంతుల వారి చరిత్ర నుంచి మనకు తెలుస్తుంది.
‘ఇక్కడి నుంచి నూరు యోజనములు కాదు వెయ్యి యోజనములు అయినా సరే దాటుతాను. ఈ సముద్రాన్ని దాటి లంక అంతా వెతుకుతాను, సీత జాడ కనిపెడతాను. ఒకవేళ సీత కనబడకపోతే రావణుడిని బంధించి తీసుకువచ్చి రాముడి కాళ్ళ మీద పడేస్తాను’, అని తన లంకా యానము యొక్క లక్ష్యం ఏమిటో ఆయన ముందే చెప్పేసారు.
లంకకు బయలుదేరే ముందే ఆయన వానరులందరితో చెప్తారు, “‘యధా రాఘవ వినిర్ముక్త’, రాముడు వదిలిపెట్టినటువంటి బాణం ఎలా ఉంటుందో అలా వెళ్తాను, వెళ్లి లంక అంతా చూస్తాను. లంక అంతా పరిశీలించి సీత జాడ కనుక్కుంటాను. సీత కనపడకపోతే రావణుడిని బంధించి తీసుకొస్తాను”, అంటారు.
ఇది దృష్టి, Vision అంటే.
ఇది మూడవది మతి అంటే బుద్ధి. సురస అనేటువంటి ఒక చేప ఒక దివ్యశక్తి. అది హనుమంతుడికి పరీక్ష పెడుతుంది. సముద్ర లంఘనం చేసే సమయంలో నోరు బాగా తెరుస్తూ, ‘బ్రహ్మ గారు నాకు వరం ఇచ్చారు. నువ్వు వస్తావని, నువ్వు నా నోట్లో ఉంటావని, ఆయన వరం ఇచ్చారు కాబట్టి ఆ వరం పూర్తి చేయవలసింది’, అని ఆవిడ నోరు తెరుస్తుంది.
తదనుగుణంగా హనుమంతుల వారు కూడా శరీరాన్ని నూరు యోజనముల వరకు పెంచి వెంటనే సూక్ష్మబుద్ధితో ఆలోచించి సూక్ష్మరూపం ధరించి సురస నోట్లో ప్రవేశించి బయటికి వచ్చేస్తారు. తన బుద్ధి కౌసల్యాన్ని అక్కడ ప్రదర్శిస్తారు హనుమ.
అంతే కాకుండా సీతమ్మ వారిని వెతుకుతున్నప్పుడు వేరు వేరు సందర్భాల్లో హనుమ తన యొక్క బుద్ధిని ప్రయోగించి నిర్ణయం చేయడం జరుగుతుంది. మనకి సుందరకాండలో ఇవన్నీ కూడా కనబడతాయి.
నాలుగవది దాక్ష్యం – Capability. సాధకుడు ఏదైనా పని సాధించాలి అంటే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, Deflection లేకుండా Distraction లేకుండా Focussed గా ఉండి ఆ పని యందే లగ్నమై ఉండటం దాక్ష్యం. ఇందుకు ఒక ఉదాహరణ. హనుమంతుల వారు వానర స్వరూపం. ముందురోజు సాయంత్రం బయలుదేరుతారు మహేంద్రగిరి పర్వతం నుండి. రాత్రంతా ఆహారం లేదు. సీతను వెతుకుతూ పాకశాలలో ప్రవేశిస్తారు. రకరకాల పదార్థాలన్నీ అక్కడ కనబడతాయి. కానీ ఆకలి వేస్తుంది తిందాంలే అని ఆగలేదు ఆయన. అమ్మవారిని వెతకడమే పని, అదే దృష్టి, అదే Focus. అది ఉన్నటువంటి వాడికి దక్షత లభిస్తుంది.
కాబట్టి హనుమంతుడి జీవితం నుండి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఈ లక్షణాల్లో నుంచి ఏ ఒక్కటి మనం పెంపొందించుకున్నా మనకు విశేషమైనటువంటి లక్షణాలు అబ్బుతాయి, సమాజానికి మనము హితవు చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాం. ధర్మస్య విజయోస్తు.