గణపతి తత్త్వం – 2
వినాయకుడు అంటే ‘నాయకత్వములో విశిష్ట లక్షణము కలిగినవాడు’, అని అర్థము. నాయకుడు అంటే సాధారణ భాషలో ‘Leader’ అని చెప్తాము. వినాయకుడికి పూజ చేసేటప్పుడు మనము కోరేది ‘సన్మార్గములో మనల్ని నడిపించమని, మనమందరం కూడా సన్మార్గములోనే ఉండాలని, సన్మార్గములో మనకి తగిన నాయకుడు లభించాలని, ఆ నాయకత్వం లక్షణాలు మనందరికి లభించాలని’.
వినాయకుడు – విఘ్నాలు:
విశిష్టమైనటువంటి నాయకుడు వినాయకుడు. ఏమిటి ఆ వైశిష్ట్యము అంటే, ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ సంకల్పం చేసినా, ఏ పని చేసినా, కార్యం జరగాలన్నప్పుడు ఆ కార్యముతో పాటు విఘ్నాలు కూడా వస్తాయి. అందుకే ‘సంకష్టహర చతుర్థి’ అంటారు. ప్రతి నెల చవితి నాడు వినాయకుడిని కష్టాలు తొలగించమని పూజ చేస్తాము. అంటే విఘ్నాలు కలుగుతాయి కార్యక్రమానికి. మనము ఏది తలపెట్టినా అందులో విఘ్నాలు కలిగి తీరుతాయి. ఆ విఘ్నానికి అధిపతి వినాయకుడు కనుక విఘ్నాధిపతి అని ఆయనకు పూజ చేస్తాము.
విఘ్నములకు అధిపతి అయినటువంటివాడు ఆయనే, విఘ్నాలను కల్పించేవాడు ఆయనే, తీసేసేవాడు ఆయనే. మనము ఏమన్నా పని తలపెట్టినప్పుడు మనకి కలిగిన Obstacles (ఏవైతే మార్గమద్యములో అడ్డుతగులుతూ ఉంటాయో), వాటిని తొలగించే శక్తి ఎలా వస్తుంది అంటే ‘బుద్ది’ ద్వారా వస్తుంది.
మనకున్న ఆలోచనా శక్తి ద్వారా మన జీవనమార్గములో (మనము సన్మార్గములో కనుక ఉంటే) సదాలోచన కలిగి, సద్బుద్ధి ద్వారా విఘ్నాలను తొలగించుకునే ఆలోచన మనకు కలుగుతుంది.
బుద్ది ద్వారా మనమనుకున్నది సాధిస్తాము, దాన్ని మనము “సిద్ది” అంటున్నాము. ‘సిద్ది, బుద్ది’ ఈ రెండు కూడా వినాయకుని భార్యలుగా చెప్పారు మనకి. భరించేవాడు భర్త కనక, ఈ బుద్ది అనే ఆలోచనను మనస్సులో రానిచ్చి, తద్వారా తనకు కలిగినటువంటి విఘ్నములను తొలగించుకునే ఆలోచన చేసి, కార్యములను సిద్ధింపచేసుకుంటాడు మానవుడు. “అటువంటి ఆలోచన, అటువంటి బుద్ది నాకు కలిగించు స్వామి”, అని వినాయకుడికి ప్రార్థన చేద్దాము.
ఏ నాయకుడైతే జరిగే కార్యక్రమాలలో రాబోయే విఘ్నాలను ముందుగా ఉహించుకోగలుగుతాడో దాన్ని మనము Planning అంటున్నాము. ఆ Planning చేసుకొని, దాన్ని Execute చేసుకొని, అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఏ నాయకుడైతే సిద్ది పొందుతాడో, ఆ నాయకుడే వినాయకుడు.
వినాయకుడిని నుంచి నేర్చుకోవాల్సిన నాయకత్వ లక్షణాలు
వినాయకుడిని మనము చూస్తే అతనికుండే ముఖము ఏనుగు ముఖము, చాలా పెద్ద చెవులు, నోరు మాత్రం చిన్నది. అంటే ‘రెండింతలు వినవయ్యా, ఒకింతే మాట్లాడు’. ఎవరు ఏమి చెప్పినా వినటం నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం.
‘ఎక్కువ విను, తక్కువ మాట్లాడు అప్పుడు నీకా నాయకత్వ లక్షణం ఏర్పడుతుంది’, అని చెప్పటమే ఈ వినాయక తత్త్వము మనకి చెప్పే లక్ష్యం. అయితే విన్న వెంటనే నిర్ణయం తీసుకోకుండా బుద్దితో దాన్ని గురించి ఆలోచించటం తరువాత లక్షణం.
‘మానవులే కాకుండా సమస్త ప్రాణులు బాగుండాలి అని ఆలోచించాలి’, అని మనకు తెలిపేదే ఈ వినాయకచవితి పండగ. ఇవాళ మనము అనేక రకాల హింసల గురించి వింటున్నాము, చూస్తున్నాము. ఆ హింస చెయ్యకుండా, ‘ఆత్మవత్ సర్వభూతాని’ అంటుంది మన ధర్మం. తన లాగా అన్ని భూతములను చూసుకోవటానికి వీలుగా ఏనుగు తల, మనిషి శరీరం. అంటే జంతువులు కదా అని వాటిని నిర్లక్ష్యం చెయ్యకూడదు.
మనిషిగా పుట్టినందుకు, ‘ఆహార నిద్రా భయ మైథునాని, సమాని చైతాని నృణాం పశూనాం! జ్ఞానం న రాణామధికో విశేషో, జ్ఞానేన హీనాః పశుభిః సమానాః !!” అన్నారు. ఆహారం, నిద్ర, భయం, ఆటలు, సంతానోత్పత్తి అనేవి మానవులకు, పశువులకు కూడా ఉంటాయి. వాటికి కూడా Feelings, Emotions ఉంటాయి అని చెప్పటమే గణేశుడి ఏనుగు ముఖం యొక్క తత్త్వం.
వినాయక జననం కథ వెనుక ఉన్న అంతరార్థం
వినాయక జనన కథ మనందరికి తెలిసినదే. పరమేశ్వరుడు, పార్వతి వారి మధ్య జరిగిన కథ.
అమ్మవారు స్నానానికి వెళ్ళటం, నలుగు పిండితో బాలుడిని చెయ్యటం, బాలుడిని కాపలా ఉంచటం, పరమేశ్వరుడు ఆ సమయానికి రావటం, ఎంత చెప్పినా వినకపోవడం, దాంతో యుద్దానికి దిగటం, ప్రమథ గణాలన్నీ కూడా ఆ బాలుడి చేతిలో ఓడిపోవటం, చివరికి ఈశ్వరుడే కల్పించుకొని ఆ బాలుడి శిరస్సు తీయటం, అమ్మవారు రావటం, ఆ తరువాత ఎలా అయినా సరే బాలుడిని బ్రతికించండి అని ఆవిడ కోరటం, ఏనుగు తల తెచ్చి అతికించటం, ఇది మనము విన్న కథ.
ఒక్కసారి ఆలోచిస్తే సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి, జగదాంబ అయిన అమ్మవారికి ఇది జరుగుతుంది అని వారికి ఆ విషయం తెలియదా? తప్పకుండా తెలుసు. అమ్మవారు ఒక నలుగు పిండిలో ప్రాణప్రతిష్ట చేసి, బాలుడిని బ్రతికించినప్పుడు, ఒకవేళ ఈశ్వరుడు తల తీసివేసినా, మళ్ళి ఆ తల్లి ప్రాణం పొయ్యలేదా? తప్పకుండా పొయ్యగలదు. మరి ఆవిడ ఈశ్వరుడిని ఎందుకు అడిగింది? సర్వజ్ఞుడైన ఈశ్వరుడు కైలాసానికి వచ్చినప్పుడు అక్కడ ఇది పార్వతి చేసిన బాలుడు, కాసేపు ఆగితే ఆవిడ వస్తుంది కదా అని ఆగకుండా, ఆ కాసేపటిలోనే కోపం తెచ్చుకొని బాలుడ్ని సంహరించటమేమిటి? అది తెలియదా ఆయనకి. ఆయనకి తెలుసు.
కానీ ఇది ఇలా ఎందుకు జరిగింది?
ఈశ్వర సంకల్పంతో పిండితో బాలుడిని సృష్టిస్తోంది ఆ తల్లి. మాతృత్వము అనేది ప్రకృతి సహజముగా స్త్రీకి లభించేది. దాన్ని ‘మాయ’ అంటారు. ప్రాణము నిలబడాలంటే ప్రకృతి, పురుషుల కలయిక తప్పనిసరి. అప్పుడే ఆ ప్రాణానికి మనుగడ ఉంటుంది. ఈ సత్యాన్ని మనకు తెలుపటానికే మహర్షులు ఒక కథ రూపములో మనకి వినాయకుడి జన్మ గాధను అందించారు.
గణపతి తత్త్వాన్ని మనము అర్థం చేసుకుంటే, సన్మార్గములో నాయకత్వ లక్షణాలు మనకి అలవడతాయి. తద్వారా ఆ గణపతి యొక్క కృపా కటాక్ష వీక్షణలు మనకి లభించి, మనల్ని విశిష్టమైన నాయకుడిగా తీర్చిదిద్దే లక్షణాలు మనము పొందుతాము. ధర్మస్య విజయోస్తు.