దీపావళి పండగ సందేశం – 1
మనము జరుపుకునే అనేక పండుగల్లో “దీపావళి” ఒక విశేషమైన పండగ. దీపావళి పండగ మనకి సన్మార్గానికి సంబంధించి ఏ సందేశం ఇస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
దీపావళి పండగ అంటే మనకు గుర్తుకువచ్చేది ‘నరక చతుర్దశి’. ఆ రోజు నరకాసుర వధ జరిగింది, అందువల్ల ఆనందముగా ఉన్నాం అని అనుకుంటాము. నిజానికి నరకాసురుడు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తే, ప్రతి మనిషిలో ఉంటాడు. ‘నర్ కా అసుర్’, అని మనము హిందీలో కనుక అన్వయించుకుంటే, మనలో ఉండే అసురుడు, దానిని పారద్రోలగలగాలి. అది దీపావళి పండగ మనకిచ్చిన సందేశము. చీకట్లని పారద్రోలి వెలుగును నింపటమంటే, మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించటం.
అజ్ఞానం అంటే ఏమిటి? తెలియకపోవటమే అజ్ఞానం. ఏ విషయము గురించి తెలియకపోతే దానిని మనము అజ్ఞానము అంటున్నాము. ఆంటే మనుష్యుల్లో ఉండేటటువంటి ఆసురీ స్వభావము, ఆంటే రాక్షసత్వము.
అజ్ఞానము అంటే?
అజ్ఞానము అసురీ లక్షణం. తెలియని విషయాలు తెలుసుకోకుండా తనకు తెలుసనుకోవటం అజ్ఞానం. మనిషి తన జీవన ప్రమాణములో వెళ్తూ వెళ్తూ నాలుగు దశలు దాటాలి అని పెద్దలు అంటారు.
“Unconsciuos incompetent state, conscious incompetent, conscious competent, unconscious competent”, అనే నాలుగు దశలను మనిషి దాటాలి. ‘నాకా విషయం తెలుసు’, అనే విషయం కూడా తెలియకపోవటం అజ్ఞానంలోని మొదటి దశ. మొదట విషయం అర్థం చేసుకోవాలి. మనలోని ఈ అజ్ఞానాన్ని తొలగించే పండగ దీపావళి పండగ. “నేను ఏ విషయం తెలుసుకోవాలి”, “నాకు ఏ విషయం తెలుసు” అనేటువంటి ఒక బేరీజు గనక మనిషి వేసుకోగలిగితే మనిషి తనని తాను వృద్ధి చేసుకోగలుగుతాడు. ఇటువంటి లక్షణాలన్నిటిని కూడా ‘అసురీ సంపద’ ఆంటే ‘రాక్షస ప్రవృతి’ అంటారు.
అదే నరకాసురుడి ప్రవృతి.
ప్రతివారిలో ‘దైవీ లక్షణాలు, రాక్షస లక్షణాలు’, రెండు కూడా ఉంటాయి. మానవుడు చెయ్యవలసినది ఏమిటంటే తనలో ఉండే అసురలక్షణాలను తొలగించుకొని దైవీ లక్షణాలను పెంచుకోగలగాలి. అటువంటి విశేషమైన ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరు చెయ్యగలగాలి. దుర్మార్గుల దగ్గిర శక్తి ఉంటే ఆ శక్తి సమాజ నాశనానికి, సమాజ విద్వేషానికి ఉపయోగిస్తాడు. సన్మార్గంలో ఉన్నటువంటి వారి దగ్గిర శక్తి (ధనశక్తి, బలశక్తి లేక ఇతర శక్తి) ఉంటే అది సమాజ ఉద్ధరణకు వినియోగిస్తాడు.
నరకాసురుడు అనే రాక్షసుడికి వరబలం ఉన్నది. ఏమిటా వరబలం అంటే, “తల్లి చేతుల్లో మాత్రమే మరణిస్తాడు”.
ఏ తల్లీ తన కుమారుడిని చంపుకోదు అనేటువంటి ధైర్యముతో దుర్మార్గానికి పాల్పడ్డాడు. శక్తిని ఇచ్చినటువంటి వాడు భగవంతుడు. ఆ శక్తిని పదిమందికి మేలు చెయ్యమని కానీ, పదిమందిని బాధ పెట్టడానికి కాదు.
నీకు అధికారం ఉన్నది, నీ అధికారంతో పదిమందికి మేలు చెయ్యి, ఏ విధముగా మేలు చెయ్యగలుగుతామో ఆలోచించు. ఆ మేలు చెయ్యటమే దైవీ స్వభావం. కీడు తలపెట్టావా! అది రాక్షస స్వభావం. అలాగే నీ దగ్గిర ధనం ఉన్నది, పది మందికి పంచి పెట్టు, పదిమందితో కలసి ఆనందముగా జీవించు. అలా ఉండగలగాలి. అంతే కానీ ఆ సంపదను దుర్వినియోగం చెయ్యటం, పది మందికి కీడు చెయ్యటానికి ప్రయత్నించటం రాక్షస స్వభావం. ఈ దీపావళి సందర్భముగా మనకు అటువంటి సందేశం ఒక నరకచతుర్దశి రోజే వస్తుంది.
అలాగే అమావాస్య నాడు వెలిగించే దీపాలు, ఆ ప్రతి దీపం, ఒక్కొక దీపం కూడా మనలో ఉండే ఒక్కొక లక్షణం. వాటినొక్కసారి మనము భేరీజు వేసుకొని దాంట్లో మనము ఎంతవరకు పొందగలుతున్నాము అనే ఆలోచన చెయ్యాలి. ప్రతి దీపము కూడా మనలో ఉండే దుర్లక్షణాలను తొలగించేందుకు ఉపయోగపడాలి అనే ఆలోచన గనుక చేస్తే, మనము మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోగలుగుతాము. ధర్మస్య విజయోస్తు.